విచారణకు సిద్ధంగా వున్న మరో కొత్త స్కామ్..

అమరావతి భూ పందేరం చూసాం, ఫైబర్ గ్రిడ్ లీలలు కూడా చూస్తున్నాం, ఈఎస్ఐ కుంభకోణం అందరికీ తెలిసిందే. పోలవరం టెండర్లు.. నిధుల గోల్మాల్ అనేది బహిరంగ రహస్యం. ఇలా బాబు హయాంలో ఎంతో అవినీతి.. మరెన్నో కుంభకోణాలు. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి చేరడానికి సిద్ధంగా ఉంది బాబు హయాంలో అమలైన ఓ కార్యక్రమం.

తాజాగా విదేశీ విద్య పేరుతో టిడిపి సర్కారు చేసిన అవినీతిపై విచారణ మొదలు కాబోతోందని తెలుస్తోంది. ఇదేమీ ఆషామాషీ పథకం కాదు, ఇప్పటి వరకు 4228 మంది విద్యార్థులను విదేశాలకు పంపించేందుకు 377. 7 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన పధకం. అయితే ఇందులో లబ్ధిదారులు ఎవరు.. ప్రభుత్వ సొమ్ముతో విదేశాలకు వెళ్లిన వారు ఏం చేస్తున్నారు.. ఎంతవరకు చదువుకున్నారు.. ఉద్యోగంలో చేరారా.. ఒకవేళ భారత్ కు తిరిగి వచ్చేస్తే ఇక్కడ ఏం చేస్తున్నారు.. అసలు వీరికి టీడీపీకి ఉన్న సంబంధం ఏమిటి.. ఇలా జరగబోతోంది విచారణ.

విదేశీ విద్య పథకం కింద కొత్తగా విద్యార్థులను ఎంపిక చేసే ప్రక్రియను వైసీపీ ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. దీన్ని పూర్తిగా సమీక్షించాలని ఆదేశాలు జారీ చేసింది. విదేశీ విద్య కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల నుంచి పదిహేను లక్షల రూపాయల వరకు ప్రభుత్వ సాయం అందుతోంది. దాని బదులు స్థానికంగా చదివే ఎక్కువ మంది విద్యార్థులకు ఆ సాయం అందిస్తే ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయంపై దృష్టి పెట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.

కేవలం 4228 మంది కోసం 377.7 కోట్ల రూపాయలకు పైగా గత ప్రభుత్వం ఖర్చు చేసింది. ఇదే ఖర్చు నిరుపేద విద్యార్థులకు వెచ్చిస్తే మంచి ఫలితాలు వచ్చేవి అనేది జగన్ సర్కార్ యోచాన. అందులోనూ ఏరికోరి టీడీపీకి అనుకూలంగా ఉండే వారు మాత్రమే ఈ పథకం కింద ఫ్లైట్ ఎక్కారు. విదేశాలకు వెళ్లి చదువు కొనే స్థోమత ఉన్నవారు కూడా ప్రభుత్వ కోటాలో ఎంచక్కా ఎగిరిపోయారు. వారు తిరిగి రారు.. వారి వల్ల ఏపీ ప్రభుత్వానికి పైసా ఉపయోగం ఉండదు. అయినా కూడా పసుపు చొక్కా వేస్తే ఫ్లైట్ టికెట్ ఇచ్చేసింది గత ప్రభుత్వం.

గతంలో పోటీ పరీక్షలకు ఉచితంగా కోచింగ్ ఇప్పిస్తామంటూ ఫేక్ కోచింగ్ సెంటర్లు సృష్టించి ప్రభుత్వ నిధులు అన్నింటినీ దారి మళ్లించారు కొంతమంది టీడీపీ నేతలు. విదేశీ విద్య పేరుతొ మరింత బరితెగించారు. అయితే పునఃసమీక్ష అంటూ వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పచ్చ పార్టీ మీడియా వక్రీకరించడం ఇక్కడ కొసమెరుపు. విదేశీ విద్యకు జగన్ సర్కార్ బ్రేక్ వేస్తోందంటూ టీడీపీ అనుకూల మీడియా కథనాలు వండి వారుస్తోంది.

సమసమాజంలో ఎక్కువ మందికి ప్రయోజనం కలగాలి అంటే ఇటువంటి పధకాలను పునఃసమీక్ష చేయడం ఏంతో అవసరంగా వైసీపీ పార్టీ భావిస్తోంది.

Leave a Comment