అప్పుల్లో పోటీ.. ప్రజలపై పెనుభారం .. !

తెలుగు రాష్ట్రాలు అభివృద్ధిలో కంటే అప్పుల్లో పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. అంచనాలకు మించి అప్పులు చేస్తూ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఇటు తెలంగాణ రాష్ట్రం ప్రజలపై పెనుభారం మోపుతున్నాయి. ఏపీ ప్రభుత్వం ఖర్చు చేస్తున్న వంద రూపాయలలో 45 రూపాయల వరకు అప్పు అని ఇటీవల కాగ్ లెక్కలు విడుదల చేయగా.. అది ప్రజల కోసం అప్పు చేస్తున్నామని అధికార పక్షం నేతలు సెలవిస్తున్నారు.

ఇక మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలోనూ అప్పుల చిట్టా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి పై ఇప్పటి వరకు ఉన్న అప్పు ఒకింత షాక్కు గురి చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అప్పుల పద్దు రోజురోజుకు పెరిగిపోతోంది.

ద్రవ్య నియంత్రణ నిర్వహణ చట్టం పరిమితులకు లోబడి ప్రభుత్వం ఏటా తెస్తున్న అప్పులు ఒక ఏడాది బడ్జెట్ ను మించిపోయాయి అంటే ఎంతగా అప్పులు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ ఏడాది 2.30 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ కాగా మొత్తం అప్పులు 2.86 లక్షల కోట్ల రూపాయలుగా ఉన్నాయి.

ఇక వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరో 41 వేల కోట్ల రూపాయలు అప్పులు పెరగనున్నట్లుగా తాజా ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు 2.44 లక్షల కోట్ల రూపాయలను బహిరంగ మార్కెట్లో సేకరించింది. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి 7852 కోట్ల రూపాయలు, స్వయంప్రతిపత్తి గల ఇతర సంస్థల నుంచి 14860 కోట్ల రూపాయలు, బాండ్ల రూపంలో 19552 కోట్ల రూపాయల రుణాలను సమీకరణ చేసినట్టుగా గణాంకాలు చెబుతున్నాయి.

2011 జనాభా లెక్కల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న జనాభాకు రాష్ట్రంలోని ప్రతి ఒక్క వ్యక్తి పై 81395 రూపాయలు అప్పు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక గతేడాది తలసరి అప్పు 65480 రూపాయలు. ప్రస్తుతం మరో 16 వేలకు పైగా పెరిగి 81395 రూపాయలకు తలసరి అప్పు చేరుకుంది. ఇదంతా రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమ పథకాల అమలుకు ప్రజల కోసమే అప్పులు చేస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం సైతం చెప్పుకోవడం కనిపిస్తోంది.

ఈ ఏడాది అప్పు పెరగడానికి కరోనా మరో కారణంగా ఇరు రాష్ట్రాలు చెప్పుకుంటున్నాయి. గత ఆరేళ్ల లెక్కలను బట్టి 2016-17 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వానికి 1.29 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంటే 2021-22 ముగిసే సరికి అప్పు 2.86 లక్షల కోట్ల రూపాయలకు చేరింది. రాష్ట్రంపై అక్షరాల ఆరేళ్లలో లక్ష 57 వేల కోట్ల రూపాయల అదనపు భారం పడింది.

మొత్తానికి ఇరు రాష్ట్రాలు అప్పులు సేకరణలో పోటీ పడుతున్నట్లుగా తాజా లెక్కలను బట్టి తెలుస్తోంది. ఇదే విషయమై విపక్షాలు కూడా తెరాస ప్రభుత్వ విధానాన్ని ఎండగట్టాయి. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల మయం చేసేస్తున్నారని.. ప్రజలపై ఆ భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

Leave a Comment