టిపిసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి బాధ్యతలు తీసుకుంటున్న తరుణంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఒక పండుగ వాతావరణం ఏర్పడిందనే చెప్పాలి. ఒక విధంగా సచ్చుబడి పోయినటువంటి కాంగ్రెస్ క్యాడర్ లో రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా నియామకం జోష్ నింపినట్లయింది. ఎంతలా అంటే అప్పుడే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టు.. దానికి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినట్టుగా సంబరాలు చేసుకుంటున్నారు.
స్పీడ్ పెంచిన రేవంత్
నిజం చెప్పాలంటే పార్టీ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో రేవంత్ ను వ్యతిరేకించే పార్టీ నాయకులు సైతం వేరే గత్యంతరం లేక ఆయనకే మద్దతు పలకడంతో ఈ ప్రమాణ స్వీకారోత్సవం ఒకరకంగా అంగరంగ వైభవంగా జరగడానికి కారణంగా తెలుస్తుంది. ఒకవైపు సోనియా గాంధీ.. మరోవైపు రాహుల్ గాంధీ కటౌట్ లతో రాత్రి నుంచి గాంధీభవన్ మొత్తం లైటింగ్స్ తో .. కార్యకర్తల కోలాహలంతో వెలిగిపోతోందంటే అందుకు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా నియమితులవ్వడం. సరే ఈ వెలుగులంతా అధ్యక్షుడి నియామకం వరకే వుంటుందా.. లేక తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ విజయానికి తోడ్పడుతుందో కాలమే సంధానం చెప్పాలి.
గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో మంచి ఫాలోయింగ్ వున్న నాయకులు కరువయ్యారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత చెప్పుకోదగ్గ నాయకులెవరూ కాంగ్రెస్ పార్టీలో కనపడలేదు. ఎందుకంటే రాజకీయాలు ఎప్పుడు ఒక నాయకుడిని బేస్ చేసుకుని నడుస్తువుంటాయి. చాలా రాష్ట్రాల్లో అలాగే రాజకీయాలు జరుగుతుంటాయి. ఇప్పటివరకూ కాంగ్రెస్ లో నియమించబడ్డ పిసీసీ నాయకులకు క్యాడర్ నుంచి అంత ఫాలోయింగ్ దొరకలేదనే చెప్పాలి. ఎప్పుడైతే రేవంత్ కి భాద్యతలు అప్పగించారో.. అప్పటినుంచే పార్టీ సీనియర్ నాయకులను అందరినీ కలుస్తూ, కలుపుకుంటూ వెళ్తున్నాడో అప్పుడే క్యాడర్ కు గట్టి బలమైన ఫాలోయింగ్ వున్నా నాయకుడిలా రేవంత్ రెడ్డి కనిపించాడు. దీంతో కాంగ్రెస్ క్యాడర్ మొత్తం సంబరాల్లో మునిగారు.
టీడీపీ క్యాడర్ లో సంబరాలు
ఇదిలావుంటే మరోవైపు ఇరు రాష్టాల్లో వున్నా టీడీపీ పార్టీ నాయకులూ సైతం ఆనందంతో సంబరాలు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. నాయకులే కాదు.. వారికి అనుకూలంగా వున్నా పత్రికలూ, చానెళ్లు, సోషల్ మీడియా గ్రూపులు రేవంత్ కు పెద్దఎత్తున ప్రచారం కల్పిస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీనే నమ్ముకుని ఆర్ధికంగా సపోర్ట్ ఇస్తున్న నాయకులకు సైతం ఒక భరోసా వచ్చినట్టైంది. ఎందుకంటే ఇప్పటికీ రేవంత్ ను తమ టీడీపీ నాయకుడిగానే భావిస్తుండటం, రేవంత్ కి టీడీపీ అంటే చెప్పలేనంత అభిమానం ఉండటం. ప్రస్తుతం టీడీపీ నాయకులకు .. వారి మీడియాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యర్ధులు బలంగా ఉండటంతో రేవంత్ రూపంలో తమకు గట్టి పోటీ ఇచ్చే నాయకుడు వచ్చాడని .. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తమకు చేదోడు వాదోడుగా ఉంటాడని వారి భావనగా తెలుస్తోంది.
అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఎంతవరకు తీసుకెళ్తాడు.. పార్టీ క్యాడర్ ఎంతవరకు పూర్తిగా సంహరిస్తుంది అనేది హుజురాబాద్ ఎన్నికల వరకు తెలిసిపోతుంది. ఎందుకంటే ఇప్పటివరకు హుజురాబాద్ లో ఈటెల వర్సెస్ టిఆర్ఎస్ గా వున్న తరుణంలో రేవంత్ రెడ్డి రాకతో ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. ఈ తరుణంలో రేవంత్ గనుక తన బలాన్ని హుజురాబాద్ ఉపఎన్నికల్లో చూపిస్తే ఇక కాంగ్రెస్ కూడా మరో ప్రత్యర్థిగా ముందుకు సాగుతుందనే తెలుస్తుంది.