వారంలోగా తేల్చండి : సుప్రీంకోర్టు

అమరావతి భూ కంభకోణంలో తుళ్లూరు మాజీ తహసిల్దార్ అన్నే సుధీర్ బాబు పై సిఐడి నమోదు చేసిన కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని వ్యాఖ్యలు కూడా చేసింది.

రాజధాని ప్రాంతం లోని ఎస్సీ ఎస్టీలకు చెందిన అసైన్డ్ భూములను ల్యాండ్ పోలింగ్ లో ఉచితంగా ప్రభుత్వం తీసుకుంటుందని, ఎలాంటి పరిహారం చెల్లించదంటూ నాడు తహసీల్దారుగా ఉన్న అన్నే సుధీర్ బాబు పెదాలను తప్పుదోవ పట్టించాడు అన్న వ్యవహారంలో కేసు నమోదైంది. అలా పరిహారం రాదు అంటూ ఎస్సీ ఎస్టీలను బెదరగొట్టి, వారి భూములను టీడీపీ నేతలకు తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయించారు అని సిఐడి గుర్తించింది.

సిఐడి తనపై కేసు నమోదు చేయగానే సుధీర్బాబు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు సిఐడి దర్యాప్తుపై స్టే ఇచ్చింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏపీ ప్రభుత్వం పిటిషన్ను విచారించిన సుప్రీం కోర్టు స్టే ఎత్తివేయడానికి నిరాకరించింది.

అదే సమయంలో ఈ అంశంపై వారం రోజుల్లోగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది. వచ్చే వారం లోగా స్టే విషయంలో హైకోర్టు నిర్ణయం తీసుకోకపోతే, తిరిగి తాము పరిశీలిస్తామని సుప్రీం కోర్టు వెల్లడించింది. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నప్పుడు స్టే లు ఇవ్వొద్దు అని పదేపదే తాము చెబుతున్నామని, అయినా ఎందుకు ఇస్తున్నారు అని ఈ సందర్భంగా సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దర్యాప్తు జరిగితేనే కదా తప్పు జరిగిందా లేదా అన్నది తెలుసుకునేందుకు అవకాశం ఉంటుందని వ్యాఖ్యానించింది. ఇలా చేయడం సరైన పద్ధతి కాదని చట్టం తన పని తాను చేసుకుపోయేందుకు వీలు కల్పించాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.

ఈ అంశంలో కేసులో ఏముంది అని హైకోర్టు వ్యాఖ్యానించడం పైన సుప్రీంకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. వచ్చే వారం లోగా ఈ కేసులో స్టేపై హైకోర్టు నిర్ణయం తీసుకోవాలని తేల్చిచెప్పింది. అలా జరగని పక్షంలో తామే మళ్ళీ పరిశీలన చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారణను మూడు వారాల పాటు వాయిదా వేసింది.

Leave a Comment