రేపటి నుంచి అన్ని పాఠశాలలు బంద్ ..

కరోనా తీవ్రత అధికంగా అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి విద్యాసంస్థలు తాత్కాలికంగా బంద్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు అసెంబ్లీలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి ప్రకటన చేశారు.

వైద్య కళాశాలలు మినహాయించి.. రాష్ట్రంలోని అన్ని గురుకుల విద్యాలయాలతో పాటుగా హాస్టల్స్ కూడా మూసివేయనున్నారు. అయితే విద్యాబోధన మాత్రం ఆన్‌లైన్ లో యథాతథంగా జరుగుతుందన్నారు. కరోనా ఎక్కువగా విద్యాసంస్థలు కేంద్రం గా విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

విద్యార్థులు మరియు ఉపాధ్యాయుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. దేశంలోని చాలా రాష్ట్రాలు ఇప్పటికే ఈ తరహా నిర్ణయాలు తీసుకున్నాయని మంత్రి సబితా ఇంద్రా రెడ్డి చెప్పారు. ఇందుకు ప్రజల సహకారం చాల అవసరమని మంత్రి కోరారు.

ఇప్పటికే 700 మంది విద్యార్థులకు కరోనా వైరస్ పాజిటివ్‌గా తేలినట్టుగా అధికారుల లెక్కల ద్వారా తెలుస్తుంది. దీంతో రాష్ట్ర వైద్యా ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు పంపింది. 10వ తరగతి లోపు పాఠశాలలను, గురుకులాలను, వసతిగృహాలను వెంటనే మూసివేయడం ద్వారా రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయగలమని సిఫార్సు చేసింది.

ఈ ప్రతిపాదనపై సమీక్షలు జరిపిన సీఎం కేసీఆర్.. స్కూల్స్ తాత్కాలికంగా మూసివేయాలని నిర్ణయించారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి అసెంబ్లీలో ప్రకటన చేశారు.అయితే 10వ తరగతి మరియు ఇతర తరగతుల పరీక్షలపై ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడాల్సి వుంది.

Leave a Comment