జగన్ మోహన్ రెడ్డి లేఖను సమర్ధించిన రిటైర్డ్ జస్టిస్ DSR వర్మ

కొందరు న్యాయమూర్తుల వ్యవహారశైలిపై ఫిర్యాదు చేస్తూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ముఖ్యమంత్రి జగన్ లేఖ రాయడం ఏమాత్రం తప్పు కాదని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్- అలహాబాద్ హైకోర్టు ల విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దంతులూరి శ్రీనివాస రంగనాధ వర్మ స్పష్టం చేసారు. ఇంట్లో వాళ్ళు తప్పు చేసినప్పుడు ఇంటి పెద్దకే ఫిర్యాదు చేస్తారు. ఇది తప్పు ఎలా అవుతుంది అని ప్రశ్నించారు.

తమపై ఫిర్యాదులు చేయడానికి వీల్లేదని అనడానికి న్యాయమూర్తులు ఈ చట్టాలకు అతీతులేమీ కాదన్నారు. రాష్ట్ర హైకోర్టు పై ఓ వ్యక్తికి ఉన్న పట్టు గురించి విదేశీ పరిశోధకులే తమ పరిశోధనా పత్రాల్లో స్పష్టంగా పేర్కొన్నారు అని, ఆ తర్వాత ఈ విషయాన్ని రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధారాలతో సహా బయట పెట్టారని చెప్పారు.

ప్రశ్నిస్తే కోర్టు దిక్కారం అంటే అది గొంతు నొక్కేయడం అన్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో పలు అంశాలపై ఆయన ఓ మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ” ఓ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేయకూడదని గానీ.. లేఖ రాయకూడదని గానీ ఎక్కడా లేదు. రాయచ్చు. దాన్ని బహిర్గతం చేయడం వల్ల తీవ్రత పెరిగింది. దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. గతంలో చాలా మంది రాశారు. భారత ప్రధాన న్యాయమూర్తి ఆ ఫిర్యాదుపై ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.

ప్రభుత్వాలు న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి. 2004-2005 లో ఇంగ్లాండు లోని బర్మింగ్ హోమ్ యూనివర్సిటీకి చెందిన ఓ వ్యక్తి భారతీయ న్యాయ వ్యవస్థ పై పరిశోధన చేశారు. 2004లో అప్పటి ముఖ్యమంత్రి రాష్ట్ర న్యాయ వ్యవస్థపై గట్టి పట్టు కలిగి ఉన్నాడని పరిశోధన పత్రంలో పేర్కొన్నారు. పరిశోధన పత్రంలో ఆ ముఖ్యమంత్రి పేరును కూడా ఉదహరించారు. ఆయన ఎవరో అందరికీ తెలుసు.

విదేశీ స్కాలర్స్ కూడా భారత న్యాయ వ్యవస్థ గురించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ న్యాయ వ్యవస్థ గురించి అలా మాట్లాడారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీని గురించి అప్పుడు ఎవరూ పెద్దగా మాట్లాడలేదు. నేను అప్పుడు హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నాను” అని ఆయన అన్నారు. న్యాయమూర్తులు ఈ చట్టానికి అతీతులు కాదని.. వారికి పరిధులు ఉన్నాయన్నారు. అతీతులమన్న రీతిలో న్యాయవ్యవస్థ వ్యవహరించరాదన్నారు.

కోర్టు ధిక్కార చట్టాన్ని ఇష్టం వచ్చినట్లు వాడరాదని, అలా చేస్తే ప్రశ్నించే వ్యక్తులు, ప్రభుత్వాల గొంతు నొక్కేయడం అవుతుందని రంగనాధ వర్మ అన్నారు. కోర్టు దిక్కారం కింద క్షమాపణ చెప్పలేదని ప్రశాంత్ భూషణ్ కు రూపాయి జరిమానా విధించిన అంశాన్ని ఆయన ప్రస్తావించారు. కోర్టు ధిక్కార చట్ట ప్రయోగం సమస్య పరిష్కారం కాదని.. అసలు సమస్య ఏమిటి.. ప్రభుత్వం ఎందుకు ఫిర్యాదు చేసింది.. ఆరోపణలు నిజమేనా అన్న అంశంపై లోతుగా విచారణ జరపాలని తెలిపారు. ఆరోపణలకు ఆస్కారం రాకుండా చూసుకోవాలి అన్నారు. ఈ దిశగా సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని.. అంతేతప్ప ధిక్కార చర్యలు పరిష్కారం చూపవని పేర్కొన్నారు.

జస్టిస్ చలమేశ్వర్ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్నప్పుడు బయట పెట్టిన ఓ సంచలనాత్మక అంశం పత్రికల పతాక శీర్షికలో వచ్చిన దానిపై ఆయన మాట్లాడారు. న్యాయమూర్తి కి, నాటి ప్రభుత్వాధినేతకు మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి ఆయన బయట పెట్టారు. న్యాయమూర్తుల నియామకం విషయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒకరు లేఖ రాశారు. దానికి సంబంధించి నాటి ప్రభుత్వాధినేత నుంచి కూడా సుప్రీంకోర్టుకు ఒక లేఖ వచ్చింది. రెండు లేఖల్లోని సారాంశం ఒక్కటే. అందులోని వ్యాఖ్యలు,పదాలు దాదాపు ఒకటే. అంటే ఆ లేక ప్రభుత్వాధినేత నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి వచ్చిందా.. లేక సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి నుంచి ఆ ప్రభుత్వాధినేతకు వచ్చిందా. ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది. ఈ వ్యవహారాన్ని ఎలా భావించాలి. దీన్నే కదా జస్టిస్ చలమేశ్వర్ ప్రశ్నించారు.

న్యాయమూర్తి ఎప్పుడూ తన అభిప్రాయాన్ని స్వతంత్రంగా వ్రాయాలి. కానీ అటు ప్రభుత్వాధినేత, ఇటు సీనియర్ న్యాయమూర్తి లేఖలు మక్కీకిమక్కి గా ఉన్నాయి. అలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి, నాటి ప్రభుత్వ అధినేత సన్నిహిత సంబంధాలు, చాలా ప్రశ్నలు సందేహాలు రేకెత్తించాయి. ఇలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రంగా పని చేయాలన్నదే ప్రజల ఆకాంక్ష అని చెప్పారు.

Leave a Comment