మూడు రాజధానుల నిర్ణయం పై హైకోర్టులో ఏపీ ప్రభుత్వానికి ఊరట..

మూడు రాజధానుల అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పరిపాలన విభాగాలను వీలైనంత త్వరగా విశాఖపట్నం తరలించాలని పట్టుపట్టి కూర్చుంది. దీన్ని త్వరగా చేయాలని సీఎం జగన్ దూకుడు ఏమాత్రం తగ్గించట్లేదు.

మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పెద్ద సంఖ్యలో హైకోర్టులో పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ల పై హైకోర్టు రోజువారీ విచారణ జరుపుతోంది. ఇందులో భాగంగా మూడు రాజధానులు ఏర్పాటు నిర్ణయం పై హైకోర్టులో రాష్ట్రప్రభుత్వం ధీటైన వాదనలు వినిపిస్తోంది.

ఏపీలో పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై CJ జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి, జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి, జస్టిస్ నైనాల జయసూర్యలతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది.

ఇప్పటికే పిటిషనర్ల తరఫు వాదనలూ ధర్మాసనంలో పూర్తయింది. ఇప్పుడు ప్రభుత్వం తన వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే తన వాదనలు బలంగా, పక్క ఆధారాలతో కొనసాగిస్తున్నారు.

కార్యనిర్వాహక, శాసన, న్యాయ రాజధానుల ఏర్పాటు నిర్ణయం వెనుక విస్తృత ప్రజా ప్రయోజనాలు ఉన్నాయని దుశ్యంత్ దవే కోర్టుకు తెలిపారు. ప్రజా ప్రయోజనాల నిమిత్తం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలలో న్యాయస్థానాల జోక్యం తగదన్నారు.

ప్రభుత్వం పాలనాపరమైన సౌలభ్యంతో పాటు అభివృద్ధి వికేంద్రీకరణకు తీసుకున్న నిర్ణయాన్ని ఆపే దిశగా ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయవద్దని ధర్మాసనాన్ని ఆయన కోరారు.

ఇక వాదనల సందర్భంగా ప్రభుత్వం తరఫు న్యాయవాది దుశ్యంత్ దవే కోర్టుముందు పలు కీలక అంశాలను ప్రస్తావించారు. గత ప్రభుత్వ హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపార వేత్తలు కలిసి రాజధాని అమరావతిని నిర్ణయించారని న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

మంత్రి నారాయణ కమిటీలో రాజకీయ నేతలు, వ్యాపార వేత్తలు, అధికారులు తప్ప నిపుణులు లేని విషయాన్ని ధర్మాసనానికి వివరించారు. అప్పట్లో కేంద్ర ప్రభుత్వం నిపుణులతో కూడిన శివరామకృష్ణన్ కమిటీని ఏర్పాటు చేసిందని.. కానీ గత ప్రభుత్వం చట్టబద్ధ కమిటీ ఇచ్చిన నివేదికను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోకుండా తనకు ఇష్టం వచ్చినట్లు నిర్ణయం తీసుకుందని వివరించారు.

అసలు శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వడానికి ముందే అమరావతిని రాజధానిగా చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని ఆయన వాదించారు. రాజధాని నిర్ణయం రాష్ట్ర పరిధిలోని అంశమన్నారు. రాజధాని ఎంపికలో కేంద్రానికి ఎలాంటి సంబంధం, పాత్ర ఉండదని ఆయన స్పష్టం చేశారు.

అదే విధంగా గతంలో ఏర్పాటైన రాజధానుల విషయంలో కేంద్రం ఎక్కడా జోక్యం చేసుకోలేదన్నారు. ఒకవేళ కోర్టులు జోక్యం చేసుకుంటే అది రాష్ట్రాల హక్కులను లాక్కోవడమే అవుతుందని దుశ్యంత్ దవే కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు. అదే సమయంలో గుంటూరు, కృష్ణా జిల్లాల మధ్య రాజధాని వద్దని శివరామకృష్ణ కమిటీ స్పష్టంగా చెప్పిందని గుర్తు చేశారు.

అయితే ప్రభుత్వ పెద్దలు తమ స్వార్థం కోసం అమరావతిని రాజధానిగా నిర్ణయించారన్నారు. ఇదే సమయంలో AG శ్రీరామ్ అసలు అమరావతి నిర్ణయం ఎలా జరిగిందో.. ఎవరెవరి పాత్ర ఏంటో ఈ కోర్టు తెలుసుకోవాలని, తెలుసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

ఇప్పటికే మూడు రాజధానుల పై ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కు గవర్నర్ విశ్వభూషణ్ ఆమోదం తెలిపారు. ఇక వైసీపీ ప్రభిత్వం తీసుకున్న 3 రాజధానుల విషయంలో కేంద్ర ప్రభుత్వం కూడా క్లారిటీ ఇచ్చింది. ఇందులో భాగంగా మూడు రాజధానులపై ఏపీ హైకోర్టు లో కేంద్రం అదనపు అఫిడవిట్ దాఖలు చేసింది.

అందులో కేంద్ర ప్రభుత్వం పలు కీలక అంశాలను ప్రస్తావించింది. విభజన చట్టం ప్రకారం మూడు రాజధానుల్లో తప్పు లేదని కేంద్రం తేల్చి చెప్పింది. విభజన చట్టంలో ఒకే రాజధాని ఉండాలని ఎక్కడ లేదని స్పష్టం చేసింది. 3 రాజధానులు పై కేంద్ర పాత్ర కేవలం అపోహ మాత్రమేనాని కేంద్ర హోంశాఖ పేర్కొంది.

ఈ మేరకు రాజధాని లేదా రాజధానుల నిర్ణయంలో తమ జోక్యం ఉండబోదని హై కోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో జగన్ ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించగా.. ఇప్పుడు రాష్ట్ర హైకోర్టులో రాజధానుల నిర్ణయం పై దాఖలైన పిటిషన్లపై విచారణ జరుగుతోంది.

Leave a Comment