కాంగ్రెస్ లోనే ఉంటా.. నా తడాఖా చూపిస్తా ..! కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ : రేవంత్ రెడ్డి టార్గెట్గా టీ కాంగ్రెస్ లో సీనియర్లు అందరూ ఏకమవుతున్నారు. ఎంతో ఆర్భాటంగా పిసిసి బాధ్యతలు స్వీకరించినప్పటికీ.. హుజురాబాద్ లో కాంగ్రెస్ కు కేవలం మూడు వేల ఓట్లు మాత్రమే రావడంతో రేవంత్ రెడ్డి పై సీనియర్లు గురి పెట్టారు.

ఇటీవలే గాంధీభవన్ లో కాంగ్రెస్ పొలిటికల్ ఎఫైర్ కమిటీ సమావేశం జరగ్గా.. ఈ సమావేశానికి కోమటిరెడ్డి రాకపోవడం పైన చర్చ జరిగింది. ఒక ఎంపీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటే ఎందుకు ఆయనతో మాట్లాడటం లేదని ఇంచార్జి మాణిక్యం ఠాకూర్ ని వీహెచ్ ప్రశ్నించారు. దాంతో కోమటిరెడ్డితో మాట్లాడే బాధ్యతను కాంగ్రెస్ నాయకత్వం వీహెచ్ కు అప్పగించింది. ( హుజురాబాద్ ఉపఎన్నిక )

రేవంత్ పై పరోక్షంగా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చురకలు

ఈ నేపథ్యంలోనే వీహెచ్ ఆహ్వానం మేరకు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సీఎల్పీ కార్యాలయానికి వచ్చారు. ఇద్దరు నేతలు చర్చించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి, పరోక్షంగా రేవంత్ రెడ్డి పై సెటైర్లు వేశారు. పెద్దపెద్ద నాయకులు ఉన్నారు కదా అని తాను హుజురాబాద్ ప్రచారానికి వెళ్లలేదని చెప్పారు. నాయకులంతా కాంగ్రెస్ కు 72 నుంచి 78 సీట్లు వస్తాయని.. నెక్స్ట్ అధికారం తమదేనని చెప్పడంతో తమ నేతలకు మంచి క్రేజ్ ఉందని భావించే తాను ఇంట్లో కూర్చున్నా అని చెప్పారు.

ఒక్క వార్డు కూడా గెలవని ఏపీలో కాంగ్రెస్ కు బద్వేల్ ఉప ఎన్నికల్లో ఆరు వేల ఓట్లు రావడం ఏంటి.. ఏకంగా అధికారంలోనికి వస్తున్నామని అనుకున్న తెలంగాణలో మూడు వేల ఓట్లు రావడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ అన్నా.. సోనియాగాంధీ అన్నా తమకు ఎప్పుడూ దేవత లాంటిదే అని కోమట్ రెడ్డి వ్యాఖ్యానించారు. కొందరికి ఒకప్పుడు సోనియాగాంధీ దెయ్యంలా.. ఇప్పుడు దేవతలా కనిపిస్తోందని రేవంత్ రెడ్డి పై కోమటిరెడ్డి సెటైర్లు వేశారు.

తాను కాంగ్రెస్ లోనే ఉంటానని, రేపటి నుంచి తన తడాఖా చూపిస్తానని కోమటిరెడ్డి ప్రకటించారు. పెద్ద పెద్ద లీడర్లు అధికారంలోకి వచ్చేస్తున్నామని.. మంత్రి పదవులు కూడా పంచేసుకున్నారని.. వారి ధీమాని చూసే తాను హుజురాబాద్ కు వెళ్లలేదన్నారు. పరిస్థితి ఇలా ఉంటుంది అని తెలిసి ఉంటే ప్రచారం చేసి ఉండేవాడినని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు.

హుజురాబాద్ లో కేవలం మూడు వేల ఓట్లు రావడం పై వీహెచ్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అసలు కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఎక్కడికెళ్ళింది అని ఆయన ఆవేదనగా ప్రశ్నించారు. పార్టీలో ఐక్యత లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని.. పదవుల్లో ఉన్నవారు కోమటిరెడ్డి ఇలాంటి వారిని కలుపుకొని పోవాలని వీహెచ్ సూచించారు. మొత్తం మీద హుజురాబాద్లో మూడు వేల ఓట్లు మాత్రమే రావడంతో రేవంత్ రెడ్డి క్రేజ్.. ఆయనపై నమ్మకం కాంగ్రెస్ లో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది అనే అభిప్రాయం కలుగుతోంది.