ఇది మీ ప్రభుత్వమని మరిచిపోయారా …!

పాలకవర్గాలపై ప్రతిపక్షాలు విమర్శలకు దిగడం సాధారణమే. ఒకవేళ అధికార పక్ష సభ్యుడే తమ వైఫల్యాలను బయట పెడితే, అది కూడా ఓ చట్టసభలో చెబితే.. అతడు పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాడని అయినా అనుకోవాలి. లేదా పార్టీ విధానాలు, సీఎం విధానాలు నచ్చకపోవడం అయినా అయి ఉండాలి. లేదా తమదే పాలకపక్షం అన్న విషయమైనా మర్చిపోయి ఉండాలి.

మరి రాజ్యసభ ఎంపీ కే. కేశవరావు ఏ ఉద్దేశ్యంతో మాట్లాడారో కానీ ఆయన అన్న మాటలు తమ పాలన సాగుతున్న రాష్ట్రంలోనే అన్న విషయాన్ని మర్చిపోయినట్టున్నారు. ఆయన మాట్లాడిన మాటలు సామాన్యులకు సైతం నవ్వు తెప్పిస్తున్నాయి. ఇంతకీ ఆయన ఏ మాటలు.. ఎక్కడ మాట్లాడారో తెలుసా. కరోనా రోగుల నుంచి ప్రైవేటు కార్పొరేట్‌ ఆస్పత్రులు అధిక ఫీజులను బలవంతంగా వసూలు చేస్తున్నాయని టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు ఆరోపించారు.

శనివారం రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ఒక ఆస్పత్రిలో ఒక బాధితుడి నుంచి ఏకంగా రూ.90లక్షలు వసూలు చేశారని సభ దృష్టికి తెచ్చారు. ‘‘ఆసుపత్రుల్లో శవాల విషయమే తీసుకోండి. నేనో ఆస్పత్రికి వెళ్లినపుడు అక్కడ శవాలు కుప్పలుగా పడి ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వమో, రాష్ట్ర ప్రభుత్వమో, మరో ఏజెన్సీయో వాటిని చేపట్టే విధంగా యంత్రాంగం ఉండాలి’’ అని సూచించారు. హైదరాబాద్‌ తెలంగాణలోనే ఉంది.

తెలంగాణలో అధికారంలో ఉన్నది ఆయన పార్టీనే. మరి ప్రైవేటు ఆసుపత్రిలో 90లక్షల రూపాయలు తీసుకుంటే ఇక్కడ తమ ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు. శవాల గుట్టలు కనిపిస్తున్నాయంటే అంతస్థాయిలో కరోనా మరణాలు జరిగాయా. మొదటి నుంచి ఇదే విషయాలను చెబుతున్న ప్రతిపక్ష పార్టీలను విమర్శిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌ నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

తెలంగాణలో మరణాలు, కేసుల సంఖ్యను తక్కువ చేసి చూపుతున్నారని ఆధారాలతో సహా బయటపెట్టిన ఓ పత్రికపై కూడా సాక్షాత్తూ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ఇంతెత్తున లేచారు కదా.. కేసీఆర్‌ పత్రికలో పేజీలకు పేజీలు రాశారు కదా.. అలాంటిదేమీ లేదు. ఆ పత్రిక అంతా అబద్ధాలు రాసిందని. ఇప్పుడు అదే విషయాలను టీఆర్‌ఎస్‌ ఎంపీ కేశవరావు నర్మగర్భంగా వాటిని ఒప్పుకున్నట్టే కదా అని విపక్షాలు విమర్శిస్తున్నాయి.

సాక్షాత్తూ రాజ్యసభలో ఈ వ్యాఖ్యలు చేసిన ఎంపీగారు సమస్యను ప్రస్తావించారు సరే.. దానికి ప్రభుత్వం ఎందుకు స్పందించలేదన్న దానికి కూడా సమాధానం చెబితే బాగుంటుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఎలా చెప్పినా తమ ప్రభుత్వ వైఫల్యాన్ని ఆ పార్టీ ఎంపీ ఏకంగా రాజ్యసభలోనే అంగీకరించారని విపక్షాలు అభిప్రాయపడుతున్నాయి. మరి, కేశవరావు వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.

Leave a Comment