జగన్ సర్కార్ సంచలన నిర్ణయం..

స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ఇకపై ప్రకటన విడుదలైన రోజు నుంచి 14 రోజుల్లోనే పూర్తి చేయనున్నారు.

ఈ మేరకు పంచాయతీరాజ్ చట్టానికి ఇప్పటికే సవరణలు చేసిన సంగతి తెలిసిందే. సంబంధిత బిల్లును ఈ నెల 30 నుంచి నిర్వహించనున్న శాసనసభ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ మేరకు క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు 2013లో పంచాయతీ ఎన్నికలను 21 రోజుల పాటు నిర్వహించారు. ఇప్పుడు ఈ వ్యవధిని 14 రోజులకు కుదిస్తూ 1994 పంచాయతీ రాజ్ చట్టానికి వైసీపీ ప్రభుత్వం సవరణలు చేసింది.

దీనిపై ఆగస్టులో గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేశారు. అయితే గడువులోగా అసెంబ్లీలో బిల్లు పెట్టకపోవడంతో కార్యరూపం దాల్చలేదు. కానీ మళ్లీ తెరపైకి వచ్చింది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఇకపై రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ ఈ విధంగా ఉంటుంది.

మొదటి రోజు ఎన్నికల ప్రకటన చేస్తారు. మూడో రోజు నామినేషన్ల స్వీకరణ. అయిదవ రోజు నామినేషన్ల స్వీకరణకు తుది గడువు ఉంటుంది. ఆరో రోజు నామినేషన్ల పరిశీలన చేస్తారు.

ఏడవ రోజు నామినేషన్ల తిరస్కరణ. అదేరోజు అభ్యంతరాలు స్వీకరణ ఉంటుంది. ఎనిమిదో రోజు అభ్యంతరాల పరిష్కారమవుతుంది. తొమ్మిదో రోజు నామినేషన్ల ఉపసంహరణ ఆతర్వాత పోటీలో నిలిచిన అభ్యర్థుల తొలి జాబితా ప్రచురణ చేస్తారు.

ఇక 14వ రోజు ఎన్నికల నిర్వహణ అదే రోజు ఓట్ల లెక్కింపు ఫలితాల ప్రకటన ఉంటుంది. మొత్తానికి స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్న వివాదానికి తెరపడే సూచనలు కనిపిస్తున్నాయి.

ఎన్నికల నిర్వహణపై ఈ కొంతకాలంగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ తో ఢీ అంటే ఢీ అంటున్న జగన్ సర్కార్ ఇప్పుడు ఎన్నికలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్ఈసి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఫిబ్రవరిలో ఎన్నికలకు సిద్ధం అని క్లారిటీగా చెప్పడంతో ఎన్నికల ఏర్పాట్లకు ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టిందని చెబుతున్నారు.

ఇందుకు సంబంధించిన కొత్త బిల్లును అసెంబ్లీలో పెట్టి ఆమోదింప చేసుకోవాలని నిర్ణయించిందని తెలుస్తోంది. తెలంగాణలో కేసీఆర్ సర్కార్ చేసినట్లే రెండు వారాల్లో ఎన్నికల ప్రక్రియను ముగించేందుకు వీలుగా కొత్త చట్టాన్ని జగన్ సర్కార్ తీసుకొస్తోంది.

కానీ సియస్ మాత్రం ఎన్నికల నిర్వహణ ఫిబ్రవరిలో సాధ్యం కాదని చెబుతూ వస్తున్నారు. ప్రభుత్వం సహకరించకపోవడంతో నిమ్మగడ్డ రమేష్ కుమార్ కలెక్టర్లతో నిర్వహించాల్సిన సదస్సులు రెండు సార్లు వాయిదా పడ్డాయి. సీఎస్ అనిమతి ఇవ్వకపోవడంతో ఎస్ఈసి సమావేశానికి వచ్చేందుకు కలెక్టర్లు నిరాకరిస్తున్నారు.

దీంతో ప్రభుత్వ నిర్ణయంపై హై కోర్టుకు కూడా వెళ్లారు నిమ్మగడ్డ. ఈ వివాదం కొనసాగుతుండగానే స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు జగన్ సర్కార్ ఏర్పాట్లు చేస్తూ ఉండడం ప్రాధాన్యతను సంతరించుకొంది.

Leave a Comment