‘డ్రీమ్11‌’ ఐపీఎల్‌-2020 టైటిల్ స్పాన్సర్

IPL 2

కరోనా కష్టకాలంలో కూడా భారత క్రికెట్‌ కాసులకు కొదవ లేకపోయింది. వినోదానికి చిరునామాకు మారిన ఐపీఎల్‌ టైటిల్ స్పాన్సర్‌షిప్ ‍ద్వారా ఒక్క సీజన్‌కే రూ. 222 కోట్లు బీసీసీఐకి లభించనున్నాయి.
ఇప్పటికే తప్పుకున్న ‘వివో’తో పోలిస్తే ఇది తక్కువగా కనిపిస్తున్నా… ఇతర మార్గాల ద్వారా తాము ఆశించిన మొత్తాన్ని దాదాపుగా అందుకునేందుకు బీసీసీఐ ప్రణాళిక రూపొందించింది. ( ఐపిఎల్ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు )

ప్రముఖ ఫాంటసీ స్పోర్ట్స్ ప్లాట్ ఫామ్ ‘డ్రీమ్ 11’ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) -2020 టైటిల్ స్పాన్సర్‌షిప్‌ హక్కులు సొంతం చేసుకుంది. ఈ ఏడాది కోసం డ్రీమ్ రూ. 222 కోట్లు చెల్లించనుంది. స్పాన్సర్‌షిప్ కోసం వేసిన బిడ్లను మంగళవారం తెరవగా…అందరికంటే ఎక్కువగా బిడ్ వేసిన డ్రీమ్ 11కు ఈ అవకాశం దక్కింది. రెండో స్థానంలో బైజూస్ (రూ. 201 కోట్లు), అన్ అకాడమీ (రూ. 170 కోట్లు) నిలిచాయి.

టాటా గ్రూప్‌ కూడా ఆరంభంలో ఆసక్తి చూపినా… నిబంధనల్లో కొన్ని షరతుల కారణంగా తుది బిడ్ దాఖలు చేయలేదని తెలిసింది. కీలక సమయంలో తమకు అండగా నిలిచిన డ్రీమ్‌ ఎలెవన్‌కు బీసీసీఐ మరో ఆఫర్ ఇచ్చింది. వచ్చే ఏడాది స్పాన్సర్‌గా వ్యవహరించేందుకు ‘వివో’ తిరిగి రాకపోతే తర్వాత రెండేళ్లు కూడా వారికే స్పాన్సర్‌షిప్‌ హక్కులు ఇవ్వనుంది. ఇందు కోసం 2021, 2022 కోసం రూ. 240 కోట్ల చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఐపీఎల్ ‍స్పాన్సర్‌గా తప్పుకున్న ‘వివో’ ఏడాదికి రూ. 440 కోట్లు చెల్లించింది. దాంతో పోలిస్తే ఇది సగమే (49.5 శాతం తక్కువ). అయితే ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద సంస్థలే ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న సమయంలో ఇది ఏ రకంగా చూసినా బోర్డుకు లాభదాయకమే. పైగా ఈ సారి అసోసియేట్ స్పాన్సర్ల సంఖ్యను మూడునుంచి ఐదుకు పెంచిన బోర్డు…చెరో రూ. 40 కోట్ల చొప్పున అదనంగా మరో రూ. 80 కోట్లను తమ ఖాతాలో వేసుకోనుంది. అంటే ఐపీఎల్‌-13 సీజన్‌నుంచి బోర్డుకు స్పాన్సర్ల ద్వారానే రూ. 302 కోట్లు రానున్నాయి. సెప్టెంబర్ 19నుంచి నవంబర్ 10 వరకు యూఏఈలో ఐపీఎల్ జరుగుతుంది.

Leave a Comment