14.29 శాతం ఫిట్‌మెంట్‌ పై సీఎం జగన్‌కు సీఎస్ కమిటీ నివేదిక

ఏపీ ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని పదకొండవ వేతన సవరణ కమిషన్ సిఫార్సుల పై అధ్యయనం చేసిన ఏపీ సీఎస్ నేతృత్వంలోని కమిటీ ప్రభుత్వానికి రికమండ్ చేసింది. పదకొండవ పిఆర్సి నివేదిక పై అధ్యయనం చేసిన సీఎస్ కమిటీ రాష్ట్ర సొంత ఆదాయం కంటే ఉద్యోగుల వేతనాల మొత్తం అధికంగా ఉందని స్పష్టం చేసింది.

ఐదేళ్లకొకసారి పిఆర్సి అమలు ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యం కాదని.. కాబట్టి పదేళ్లకు ఒకసారి వచ్చే కేంద్ర వేతన సవరణ కమిషన్ ను రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాలని సూచించింది. గత కొన్ని ఏళ్లుగా పిఆర్సి సిఫార్సు అమలు చేసిన దానికంటే అధికంగా ఫిట్‌మెంట్‌ ను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తూ వచ్చిందని.. ఇక పై భారం భరించే స్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి లేదని.. కాబట్టి కేంద్ర ఏడవ వేతన సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకొని రాష్ట్ర ఉద్యోగులకు 14.29 శాతం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫార్సు చేసింది.

చాలా రాష్ట్రాల్లో ఇప్పటికే 10 ఏళ్లకు ఒకసారి వచ్చే కేంద్రం వేతన సంఘం సిఫార్సులను అనుసరిస్తున్నాయని సీఎస్ కమిటీ వివరించింది. రాష్ట్ర 11వ వేతన సవరణ కమిషన్ 27శాతం ఫిట్‌మెంట్‌ ను సిఫార్సు చేసిందని.. అదే తెలంగాణలో పిఆర్సి కేవలం 7.5 శాతం మాత్రమే ఫిట్‌మెంట్‌ గా సిఫార్సు చేసిందని వెల్లడించింది.

ప్రభుత్వ మొత్తం వ్యయంలో ఉద్యోగుల జీతాలకు దేశంలో ఏపీ అత్యధికంగా 37 శాతం ఖర్చు పెడుతోందని సీఎస్ కమిటీ తేల్చింది. ఏపీ తర్వాత ఛత్తీస్ ఘడ్ లో ఈ మొత్తం 32 శాతంగా ఉండగా.. మహారాష్ట్రలో 31 శాతంగా ఉంది. అదే తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వ వ్యయంలో ఉద్యోగుల జీతాల మొత్తం కేవలం 21 శాతంగానే ఉందని సీఎస్ కమిటీ వివరించింది.

14.29 శాతం ఫిట్‌మెంట్‌ ను వ్యతిరేకిస్తున్న ఏపీఎన్జీవో

రాష్ట్ర ప్రభుత్వానికి వస్తున్న సొంత రాబడి ఆదాయం 2020 – 21 లో 60,688 కోట్ల రూపాయలుగా ఉంటే.. ఉద్యోగుల జీత భత్యాల మొత్తం 67,340 కోట్లుగా ఉందని, ఇది సొంత రాబడికి మించి ఉందని వివరించింది. సొంత రాపిడి 100% గా ఉంటే ఉద్యోగుల జీతాల మొత్తం 111 శాతంగా ఉందని సీఎస్ కమిటీ తేల్చింది. అయితే ఫిట్‌మెంట్‌ ను 14.29 శాతంగా సిఫార్సు చేయడాన్ని ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.

సీఎస్ కమిటీ సిఫార్సును తాము అంగీకరించబోమని.. ఫిట్‌మెంట్‌ ను కచ్చితంగా పెంచాల్సిందేనని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి డిమాండ్ చేశారు. కేంద్ర వేతన సంఘం ప్రకారం ఫిట్‌మెంట్‌ ఇవ్వాలని సీఎస్ కమిటీ సిఫార్సు చేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని ఏపీఎన్జీవో అధ్యక్షుడు బండి శ్రీనివాస్ చెప్పారు. సీఎం జోక్యం చేసుకుని సరైన నిర్ణయం తీసుకుంటారని తాను ఆశిస్తున్నట్లు చెప్పారు.

అయితే సీఎస్ కమిటీ సిఫార్సులు అమలు చేస్తే ఇప్పటికే ఇస్తున్న 27 శాతం ఐఆర్ లో కోత పడుతుంది. కానీ ఆ పరిస్థితే రాకపోవచ్చు. ఇప్పుడు ఇస్తున్న జీతాలను తగ్గించే అవకాశం ఉండకపోవచ్చు. కాకపోతే కొన్ని ఉద్యోగ సంఘాలు ఆకాశంలో విహరిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని సీఎస్ కమిటీ స్పష్టంగా వివరించింది. ఇప్పుడు బంతి సీఎం కోర్టులో ఉంది. సీఎం జగన్ ఉద్యోగులకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోవచ్చు. సీఎస్ కమిటీ చెప్పినట్లు జీతాలను తగ్గించే నిర్ణయం తీసుకోకుండా.. అదే సమయంలో భారీగా ఫిట్మెంట్ లేకుండా.. ఉద్యోగులు బాధపడకుండా మధ్యేమార్గంగా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనిపై సీఎం జగన్ తన నిర్ణయాన్ని వెలువరించాల్సి వుంది.

Leave a Comment