మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా నేనే..! సీఎం కెసిఆర్

కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతారు అంటూ గత కొన్ని రోజుల నుండి జోరుగా సాగుతున్న ప్రచారానికి సీఎం కేసీఆర్ తెరదించారు. తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్ అధ్యక్షతన ఆదివారం తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండున్నర గంటల పాటు కొనసాగిన ఈ సమావేశంలో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు.

ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ తాను పూర్తి ఆరోగ్యంతో ఉన్నానని, సీఎంగా తానే కొనసాగుతానని వెల్లడించారు. సీఎం మార్పుపై ఎవరూ మాట్లాడొద్దని సూచించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ( మీకు తెలుసా ..! అక్కడ రెండు నెలలు సూర్యుడు కనిపించడు )

ఈ నెల 12 నుంచి టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభం అవుతుందని.. మార్చి ఒకటి నుంచి పార్టీ కమిటీల నియామకం జరుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఏప్రిల్ లో లక్షలాది మందితో టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

ఎమ్మెల్సీ, నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో టిఆర్ఎస్ కు ఎవరు పోటీ లేరని కేసీఆర్ పేర్కొన్నారు.

ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలు విజయం టీఆర్ఎస్ దేనని తెలిపారు. పార్టీ సభ్యత్వ నమోదును నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని టిఆర్ఎస్ లీడర్లకు సీఎం కేసీఆర్ సూచించారు.

Leave a Comment