AB వెంకటేశ్వరరావు..పైగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్.. కానీ ఎందుకిలా ?

సీనియర్ ఐపీఎస్ అధికారి.. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ AB వెంకటేశ్వరరావుగా ఏపీ సమాజానికి పరిచయమైన ఉన్నతాధికారి. చంద్రబాబు హయాంలో కంటి చూపుతో శాసించిన ఉన్నతాధికారి. తానొక ఉన్నత ప్రభుత్వ ఉద్యోగి అన్న విషయాన్ని మరిచి పచ్చ కండువా వేసుకున్నట్లుగా చంద్రబాబు, టిడిపి నేతలను మించి రాజకీయాలు చేసి ప్రస్తుతం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వైసీపీ నుంచి టిడిపిలోకి 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలు నాడు టీడీపీలోకి జంప్ కావడంలో కీలక సూత్రధారి AB వెంకటేశ్వరరావు అనే ఆరోపణలు ఉన్నాయి. దాని పర్యవసానాలను నేడు ఆయన అనుభవిస్తున్నారు.

ఆయన వైఖరే ప్రధాన కారణం

AB వెంకటేశ్వరరావు ఏ స్థాయిలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందంటే.. ఆయన సర్వీసులో కొనసాగేందుకు అనర్హుడని.. ఆయన్ను తొలగించాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసే వరకు వెళ్ళటం. దీన్నిబట్టి AB వెంకటేశ్వరరావు పై జగన్ ప్రభుత్వం ఎంత కఠినంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. 2019 ఎన్నికల్లో జగన్ భారీ విజయం నమోదు చేసుకున్నప్పటి నుంచి AB వెంకటేశ్వరరావు మానసికంగా అనుభవిస్తున్న బాధ ఆయనకు తప్ప మరొకరికి తెలియకపోవచ్చు. ఆ బాధ ఇతరులతో చెప్పుకున్నా పోయేది కాదు.

ఏపీలో ఎంతోమంది ఉన్నత అధికారులు ఉన్నా.. జగన్ అధికారంలోకి వస్తే ఎవరికీ లేని భయం, ఆందోళన ఒక్క ఏబీకే ఎందుకు అని ప్రశ్నించుకుంటే.. అందులోనే సమాధానం దొరుకుతుంది. ఇంటెలిజెన్స్ చీఫ్ గా ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు రాష్ట్రంలో ఏం జరుగుతుందో సమాచారం ఇచ్చే వరకు పరిమితమై ఉంటే ఏబీ వెంకటేశ్వరరావుకు నేడు ఈ సమస్య ఉండేది కాదు. కానీ ఆయన చంద్రబాబు మెప్పుకోసం, ప్రధాన ప్రతిపక్షం వైసీపీని అంతమొందించేందుకు తనది కానీ పనిలోకి దిగారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. అప్పుడే జగన్, తదితర వైసీపీ నేతలు ఏబీ వెంకటేశ్వరరావు పై విమర్శలు సంధించారు.

AB వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయండి

మొదట్లోనే తన వైఖరి మార్చుకుని ఉంటే AB వెంకటేశ్వరరావుకు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు శాశ్వతమని భావించి, పరిధికి మించి ప్రవర్తించిన ఏవి వెంకటేశ్వరరావు.. ప్రస్తుతం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. తాజాగా AB వెంకటేశ్వరరావును డిస్మిస్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకోవటం సంచలన కలిగిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఈ జీవో ద్వారా AB వెంకటేశ్వరరావు డిస్మిస్ అమలు చేయాలని కేంద్ర హోంశాఖకు ప్రతిపాదనలు వెళ్లాయి.

ఇందులో వెంకటేశ్వరరావు పై ఉన్న అభియోగాలు.. విచారణలో నిగ్గు తేలిన అంశాలను పేర్కొని ఒక అభియోగ పత్రాన్ని కేంద్రానికి పంపడం విశేషం. రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సులు, అభియోగ పాత్రలను సమగ్రంగా పరిశీలించైనా తర్వాత యూపీఎస్సీ అభిప్రాయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంది. అనంతరం డిస్మిస్ పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఇంత జరుగుతున్నా బ్యూరోక్రాట్స్ నుంచి AB వెంకటేశ్వరరావు కు కనీస మద్దతు కూడా రావడం లేదు. దీన్నిబట్టి ఆయన వ్యవహార శైలి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Comment