రామ జన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంట..

తమిళనాడు రాష్ట్రానికి చెందిన రాజ్యలక్ష్మి అనే మహిళ రామ జన్మభూమి అయోధ్యకు 613 కిలోల గంటను తయారు చేయించి రామేశ్వరం నుంచి తీసుకెళ్తున్నారు. ఈనెల 17న ప్రధాని మోదీ పుట్టినరోజు సందర్భంగా రామ రథయాత్ర పేరుతో రామేశ్వరం నుంచి గంటను తీసుకొని బయల్దేరిన క్రమంలో శుక్రవారం ఉదయం ఐదో శక్తిపీఠం అయిన జోగులాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చేరుకున్నారు.

ఈ విషయం తెలుసుకున్న జోగులాంబ గద్వాల బిజెపి జిల్లా అధ్యక్షులు రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు మరియు అలంపూర్ పట్టణ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు ఈవో ప్రేమ్ కుమార్ మేళతాళాల మధ్య రాజ్యలక్ష్మి తీసుకువచ్చిన గంట ఉన్న వాహనాన్ని జోగులాంబ సన్నిధికి తీసుకు వెళ్లారు .ఈ గంటను అయోధ్యకు తీసుకెళ్తున్న సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జైశ్రీరామ్ నినాదాలతో ఆలయ ప్రాంగణమంతా మారుమ్రోగింది. పవిత్రమైన రామ జన్మభూమికి తీసుకెళ్తున్న గంటను దర్శించుకోవటం ఆనందంగా ఉందని అక్కడి స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.

దక్షిణ భారతదేశం నుంచి 613 కిలోల గంటను తయారు చేయించి అయోధ్యలో నిర్మిస్తున్న రామ మందిరానికి తీసుకెళ్తుండటం పూర్వజన్మ సుకృతమని రాజ్యలక్ష్మి అన్నారు. స్వయంగా తానే వాహనాన్ని నడిపి 10 రాష్ట్రాల గుండా 4,552 కిలోమీటర్లు ప్రయాణించేస్తూ, వచ్చే నెల 7న అయోధ్యకు చేరుకోనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో పూజలు నిర్వహించడం ఆనందంగా ఉందని ఆమె పేర్కొన్నారు.{ రామ మందిరానికి భూమిపూజ }

Leave a Comment